కర్రెగుటల్లో డీజీపీ పర్యటన.

పుడమిటివి సమాచారం

ఎలకంటి నరేష్
బ్యూరోచీఫ్ పుడమిటివి

 

కర్రెగుటలో అభివృద్ధికి సువర్ణ అధ్యాయానికి డిజిపి అడుగులు.

హింసకు స్వస్తి.. సమాజంలో భాగస్వామ్యం కావాలని డిజిపి సివి ఆనంద్ సందేశం.

లొంగిపోవాలని గణపతి దంపతులకు పోలీసుల పిలుపు

బ్యూరోచీఫ్ పుడమిటివి

ఆపరేషన్ కగార్ తో తెలంగాణ ఆంధ్ర చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాలలో ఉన్న కర్రెగుట్టలను జల్లెడ పట్టిన భద్రతా బలగాల కృషి వమ్ము కాలేదు. నాడు కర్రెగుట్టల దండకారణ్యంలో తుపాకుల మోతలతో తూటాల వర్షం కురిసి రక్తమోడిన నేల నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో లొంగిన మావోయిస్టుల కంచుకోటలో నేడు అభివృద్ధికి బాటలు పడుతున్నాయి.

ఏప్రిల్ 7న కర్రెగుటలలోని సిఆర్పిఎఫ్ 39  పామూనురు బెటాలియన్ ను అప్పటి డిజిపి బి.శివధర్ రెడ్డి సందర్శించి మారుమూల ప్రాంతాల అభివృద్ధి నాంది పలికితే.. సోమవారం కర్రెగుట్టల పర్యటనకు వచ్చిన డీజీపీ సివి ఆనంద్ మరో అడుగు ముందుకు వేసి పామూనురు బెటాలియన్ ను దాటి చెలిమల, డోలి, తడపాల మీదుగా సుమారు 28 కిలోమీటర్ల మేర నిర్మించిన రహదారిని పరిశీలించి కర్రెగుటలలో శాశ్వత అభివృద్ధికి అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.

డీజీపి పర్యటన సాగిందిలా..

డీజీపి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కర్రేగుట్టల్లో ఆయన పర్యటించారు. ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్న డిజిపి జిల్లాలోనే బస చేసిసోమవారం ఉదయం  పామునూరు 39 సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపునకు చేరుకున్న ఆయన పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.    అక్కడి నుంచి కర్రేగుట్టల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన రహదారి పనులను పరిశీలించారు. పామునూరు, చెలిమల, డోలి, తడపాల మీదుగా సుమారు 28కిలోమీటర్ల మేర నిర్మించిన రహదారిని పరిశీలించి అక్కడ జెండా ఎగురవేసి, శాంతికపోతాలని గాల్లోకి వదిలారు. ఈ క్రమంలో అక్కడ పనుల్లో అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.పామునూరులో నివాసం ఉంటున్న గుత్తి కోయలకు బియ్యం, దుప్పట్లు అందజేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

పునరావాస విధానాలతోనే భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు.

ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. మావోయిస్టుల అణచివేతలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేశామని తెలిపారు. మావోయిస్టుల కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయించామని, కొందరు ఎన్కౌంటర్లలో మృతి చెందగా.. ప్రభుత్వం తీసుకొచ్చిన పునరావాస విధానాలతో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా అందించామని తెలిపారు. త్వరలోనే ఈ ప్రాంతం అరణ్య ప్రాంతమైనప్పటికీ అటవీశాఖతో కలిసి చూడదగ్గ ప్రదేశాలను గుర్తించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని డీజీపీ వెల్లడించారు.

40 ఏళ్ల మావోయిస్టు జీవితం.. జనజీవన స్రవంతిలోకి..

దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో అండర్‌గ్రౌండ్‌లో కొనసాగిన సీపీఐ (మావోయిస్టు) సీనియర్‌ నాయకురాలు కాకర్ల సమత అలియాస్‌ మాధవి, షకీలా, దుర్గా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ములుగులో డీజీపి సీవీ ఆనంద్‌ విలేకరుల సమావేశంలో ఆమె నేపథ్యం, పార్టీ బాధ్యతలు, కుటుంబ వివరాలు, ప్రభుత్వం అందిస్తున్న పునరావాస సదుపాయాలను వెల్లడించారు.

1985లో అండర్‌గ్రౌండ్‌లోకి..

1985లో వైజాగ్‌ ప్రాంతంలో నక్సలైట్‌ కార్యకలాపాలకు ప్రభావితమైన సమత అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు డీపిజీ తెలిపారు. అప్పటి నుంచి సుమారు 40 ఏళ్లపాటు వివిధ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీకి పనిచేశారన్నారు. హైదరాబాద్‌ కమిటీలో సుమారు పదేళ్లు, నల్లమలలో నాలుగేళ్లు, ఉత్తరప్రదేశ్‌ ఏరియా కమిటీలో రెండేళ్లు, గుజరాత్‌ గోల్డెన్‌ కారిడార్‌ కమిటీ’ లో రెండేళ్లు, మహారాష్ట్ర ఏరియా కమిటీలో ఐదేళ్లు, కర్ణాటక–మహారాష్ట్ర ఉమ్మడి కమిటీలో పదేళ్లు పనిచేసినట్లు వివరించారు.

పార్టీ డాక్యుమెంటేషన్‌లో కీలక పాత్ర

సమత సాయుధ కార్యకలాపాలతో పాటు పార్టీ సిద్ధాంతపరమైన, డాక్యుమెంటేషన్‌ బాధ్యతలు నిర్వహించినట్లు డిజిపి తెలిపారు. సెంట్రల్‌ కమిటీ తీర్మానాలు, పార్టీ పత్రాల రూపకల్పన, సిద్ధాంతపరమైన అంశాల రచన, అనువాదాలు, మహిళా సమస్యలపై వ్యాసాల రచన, క్యాడర్‌కు అవగాహన కల్పించడం వంటి బాధ్యతలు చేపట్టారన్నారు. మావోయిస్టు పార్టీ జనరల్‌ సెక్రటరీ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతికి సీసీ స్టాఫ్‌ మెంబర్‌గా కూడా పనిచేసినట్లు సమత వెల్లడించిందన్నారు.

కుటుంబంలోనూ మావోయిస్టు నేపథ్యం

సమత సోదరి కాకర్ల సునీత అలియాస్‌ బద్రి కూడా సీనియర్‌ మావోయిస్టు నాయకురాలిగా పనిచేసి గత ఏడాది తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు డీజీపి తెలిపారు. మరో కజిన్‌ సోదరి కాకర్ల పద్మ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో పనిచేసిందన్నారు. 2018లో అరెస్టయిన ఆమె ప్రస్తుతం బెయిల్‌పై చెన్నైలో ఉంటున్నట్లు వెల్లడించారు.సమత భర్త పటేల్‌ సుధాకర్‌రెడ్డి మావోయిస్టు పార్టీలో సీనియర్‌ క్యాడర్‌గా, మిలిటరీ కమిషన్‌, పార్టీ ఇంటెలిజెన్స్‌ విభాగాల్లో కీలకంగా పనిచేసినట్లు డీజీపి తెలిపారు. 2010లో జరిగిన ఎదురుకాల్పుల్లో సుధాకర్‌రెడ్డి మృతి చెందినట్లు చెప్పారు.

సరెండర్‌ క్యాడర్‌కు ప్రభుత్వం అండ

మావోయిస్టుల పునరావాసంలో తెలంగాణ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తోందని డిజిపి సీవీ ఆనంద్‌ తెలిపారు. సరెండర్‌ అయిన వారికి ఆర్థిక సాయం, సామాజికంగా స్థిరపడేందుకు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి హామీ మేరకు ఉచిత వైద్య చికిత్స కోసం ఆరోగ్య రక్షణ కార్డులు జారీ చేసి పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

ఉపాధి.. శిక్షణ.. రుణాలు

సరెండర్‌ అయిన వారు గౌరవప్రదంగా జీవించేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డిజిపి తెలిపారు. వృత్తి లేదా వ్యాపారం చేయాలనుకునే వారికి శిక్షణతో పాటు రుణాలు అందించి స్వయం ఉపాధికి సహకరిస్తామన్నారు. ఆరోగ్య, కేసులు లేదా ఇతర సమస్యలు ఉంటే పోలీసు అధికారులను సంప్రదించాలని సూచించారు. సరెండర్‌ అయిన వారిని పూర్తిగా జనజీవన స్రవంతిలో కలపడం పునరావాస విధానం లక్ష్యమన్నారు.

23 మందికి రూ.2 కోట్ల వరకు సాయం

పునరావాస విధానం కింద ఇప్పటికే 23 మంది సరెండర్‌ అయిన మావోయిస్టులకు దాదాపు రూ.2 కోట్ల వరకు ఆర్థిక సాయం అందించినట్లు డిజిపి తెలిపారు. సెంట్రల్‌ కమిటీ, స్టేట్‌ కమిటీ, పార్టీ మెంబర్‌ లేదా ఇతర క్యాడర్‌ అనే తేడా లేకుండా సరెండర్‌ తర్వాత సాధారణ జీవితంలో స్థిరపడేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు.

గణపతి దంపతులకు పోలీసుల పిలుపు

మావోయిస్టు పార్టీ జనరల్‌ సెక్రటరీ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, ఆయన భార్యతో పాటు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న సీనియర్‌ నాయకత్వం హింసా మార్గాన్ని వీడి లొంగిపోవాలని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు.

ములుగులోనే సమావేశం ఎందుకంటే..

మావోయిస్టు కార్యకలాపాలకు గతంలో కీలకంగా ఉన్న ప్రాంతం కావడంతో హైదరాబాద్‌కు బదులుగా ములుగులో కార్యక్రమం నిర్వహించినట్లు డిజిపి సివి ఆనంద్ తెలిపారు. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ మధ్య దట్టమైన అటవీ ప్రాంతం గతంలో మావోయిస్టు కార్యకలాపాలకు కారిడార్‌గా ఉండేదని, ఈ ప్రాంతంలో పర్యటించి సరెండర్‌ క్యాడర్‌తో నేరుగా మాట్లాడినట్లు చెప్పారు. వారి సమస్యలు, పునరావాస విధానంలోని లోపాలు, కేసుల సమస్యలను తెలుసుకున్నామని, అవసరమైతే కేంద్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు.

హింసకు స్వస్తి.. సమాజంలో భాగస్వామ్యం కావాలి

మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచి సమాజంలో కలిసిపోవాలని డిజిపి సీవీ ఆనంద్‌ పిలుపునిచ్చారు. సరెండర్‌ అయిన వారు తిరిగి అండర్‌గ్రౌండ్‌ బాట పట్టకుండా కుటుంబాలతో కలిసి గౌరవప్రదమైన జీవితం గడిపేలా చేయడమే ప్రభుత్వ పునరావాస విధానం లక్ష్యమన్నారు.
“సరెండర్‌ అయిన వారికి ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉపాధి, శిక్షణ, రుణాలు, ఆరోగ్య సమస్యలకు వైద్య సాయం అందిస్తాం. వారు సాధారణ పౌరులుగా జీవించాలన్నదే మా ప్రధాన ఉద్దేశం” అని తెలిపారు.

కర్రెగుట్టలో పర్యటనలో డిజిపి సివి ఆనంద్ తో పాటు మల్టీజెన్ వన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజి కార్తికేయ, రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా, సిఆర్పిఎఫ్ ఎడిజి విక్రమ్ సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పి సింధు శర్మ, ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, డి ఎఫ్ ఓ వికాస్ మీనా, ఏ ఎస్ పి మనన్ భట్ ఐపిఎస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *